భారత్ డ్రోన్ దాడులతో పాక్ ఉక్కిరిబిక్కిరి... తీవ్ర ఆందోళనలో పీఎస్ఎల్ విదేశీ ఆటగాళ్లు!

  • పాక్‌లో భారత దాడులు
  • రావల్పిండి స్టేడియం వద్ద డ్రోన్ క్రాష్
  • రావల్పిండిలో పీఎస్ఎల్ మ్యాచ్‌ను వాయిదా వేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) మ్యాచ్‌పై తీవ్ర ప్రభావం పడింది. రావల్పిండి క్రికెట్ స్టేడియంలో గురువారం జరగాల్సిన పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్‌ను రద్దు చేశారు. భారత సాయుధ బలగాలు పాకిస్థాన్‌లోని రావల్పిండితో సహా పలు కీలక ప్రాంతాల్లోని ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో పీఎస్ఎల్ మిగిలిన మ్యాచ్‌లను దోహా లేదా దుబాయ్ వంటి విదేశీ వేదికలకు తరలించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా, పీఎస్ఎల్ లో ఆడుతున్న విదేశీ క్రికెటర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.

బుధవారం పీఎస్ఎల్ షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని పీసీబీ ప్రకటించినప్పటికీ, గురువారం ఉదయం భారత్ మరోసారి దాడులకు దిగడంతో పరిస్థితి మారింది. "రావల్పిండిలో జరగాల్సిన పీఎస్ఎల్ మ్యాచ్ డ్రోన్ దాడి కారణంగా రద్దయింది. విదేశీ ఆటగాళ్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు, వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని భావిస్తున్నారు" అని ఒక మాజీ పాక్ క్రికెటర్ తెలిపారు.

మే 7న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా, భారత్ పాక్ మరియు పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. దీనికి పాకిస్థాన్ ప్రతిదాడికి యత్నించింది. దాంతో, గురువారం ఉదయం భారత్... పాక్‌లోని ఎయిర్ డిఫెన్స్ రాడార్లను లక్ష్యంగా చేసుకుందని, లాహోర్‌లోని ఒక రాడార్ వ్యవస్థ దెబ్బతిన్నదని భారత ప్రభుత్వం తెలిపింది.

ఈ నేపథ్యంలో, పీఎస్ఎల్ భవిష్యత్తుపై చర్చించేందుకు పీసీబీ, ఫ్రాంచైజీలతో లాహోర్‌లో అత్యవసర సమావేశం నిర్వహించింది. రావల్పిండిలో గురువారం జరగాల్సిన పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ మధ్య పీఎస్ఎల్ మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. "అందరు భాగస్వాములతో సంప్రదింపులు జరిపిన అనంతరం, పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ మధ్య ఈ రాత్రి జరగాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేయాలని నిర్ణయించాం. సవరించిన తేదీని త్వరలోనే ప్రకటిస్తాం" అని పీసీబీ ఒక మీడియా ప్రకటనలో వెల్లడించింది.

Pakistan Super League
PSL
India-Pakistan tensions
Drone attacks
Rawalpindi
Cricket match
Foreign players
PCB
Terrorism
Air defense systems

More Telugu News